తేయాకు తోటలో.. ఓట్ల వేటలో.. ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ యువరాణి. చిటికేస్తే అస్సాం టీ.. టేబుల్ మీద రెడీ. అలాంటిది ప్రియాంక గాంధే స్వయంగా అసోం వెళ్లింది. తేయాకు తోటల్లో టీ ఆకులు తెంపింది. తలకు బుట్ట వేసుకొని.. కూలీలతో కలిసి తేయాకులను తెంపారు ప్రియాంక. యువరాణి ఇంతలా కష్టపడింది టీ తాగడం కోసం కాదు. అసోం ఓటర్లను ఆకట్టుకోడానికి. 

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్‌ జోరుగా ప్రచారం సాగిస్తోంది. అసోంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె రెండో రోజులుగా అసోంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి కూలీలతో మాట్లాడారు.   

టీ తోటల్లోకి వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. ‘‘తేయాకు కూలీలు అసోంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటుంది’’ అని ప్రియాంక తెలిపారు.   

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అసోంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి భాజపా అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. ఈ సారి అసోం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్‌ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. రెండు రోజులుగా అసోంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తేయాకు తోటలో పని చేసి, కూలీలతో మాట్లాడి అక్కడి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు ప్రియాంక గాంధీ. ఆమె అలా సాధారణ వ్యక్తిలా జనంతో కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది.