కుప్పకూలిన విమానం.. బ్రెజిల్ లో 62 మంది దుర్మరణం
posted on Aug 10, 2024 10:43AM
బ్రెజిల్లో శుక్రవారం (ఆగస్టు 9) జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కుప్ప కూలి పోయింది. కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులెవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారం భించారు.