త్వరలో పవన్ కళ్యాణ్ అమూల్యాభిప్రాయాలు విడుదల

 

కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన సందేశంపై మీడియాలో వచ్చిన విమర్శలను చూసినందునో మరేమో తెలియదు కానీ త్వరలోనే తను ఓటుకి నోటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8లపై తన అమూల్యమయిన అభిప్రాయాలు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ అకౌంటులో ఓ సందేశం పెట్టారీ రోజు. దానితోబాటు ఆయన మరో గొప్ప సందేశం కూడా పెట్టారు. “తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలుతో ప్రభుత్వాలని నడిపితే 'భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.” ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒకరకమయిన ఘర్షణ వాతవరణం నెలకొని ఉండగా ఆ సంగతి వదిలిపెట్టి ఎప్పుడో భావితరాలవారి మధ్య యుద్దాలు జరుగుతాయని ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది.