తుమ్మలకు పోటీగా నామా.. ఆయన అయితేనే గట్టి పోటీ..!

 

కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో పాలేరు ఉపఎన్నిక ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక పోటీ చాలా రసవత్తరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈ ఎన్నికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగుతుండగా.. టీడీపీ నుండి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలోకి దింపాలని తెదేపా తెలంగాణ శాఖ గట్టిగా భావిస్తోంది. అంతేకాదు.. జిల్లా, రాష్ట్ర నేతలు, కార్యకర్తలంతా నామా నాగేశ్వరావు అయితేనే గట్టి పోటీ ఇస్తారని అధినేత చంద్రబాబుకు సూచిస్తున్నారట. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం గురువారం రాత్రి చంద్రబాబును కలసి ఈ ప్రతిపాదన చేశారట. కాగా బరిలోకి దిగడానికి నామా కూడా సుముఖంగా ఉన్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. మరి నామా కూడా బరిలో దిగితే ఉపఎన్నికపై పోటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది.