మారని పాక్ తీరు.. ఘోర పరాభవం తరువాత కూడా ప్రగల్భాలు

పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది. దాంతో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు వేడుకుంది. మానవతా దృక్పథంతో అందుకు అంగీకరించింది. ఇంత జరిగినా పాకిస్థాన్ తీరు మారలేదు. తాజాగా పాకిస్ధాన్ ప్రధాని తన నోటికి పని చెప్పి వాచాలతను చాటుకున్నారు.  1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అంతే కాదు ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తాయని చెప్పడం ద్వారా మరోసారి కయ్యానికి కాలుదువ్వారు. 

పాక్ ప్రధాని మాటలకు వంత పాడుతున్నట్లుగా ఆ దేశ సైనిక ప్రతినిథి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఉగ్రభావజాలాన్ని వ్యక్తం చేస్తూ అదుపు తప్పి మాట్లాడారు.  ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై నిప్పులు కక్కారు. పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. "మీరు మా నీటిని అడ్డుకుంటే..  మేం మీ ఊపిరిని అడ్డుకుంటామన్నారు.

దీనికి భారత్ కూడా దీటుగా స్పిందించింది.   ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని  తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ లోనే ఉంటుందని పునరుద్గాటించారు. అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించవని గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.