ఔటర్ రింగ్ రోడ్డుపై య‌ముడి తాండ‌వం   గాలిలో కలుస్తున్న ప్రాణాలు 

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఎందుకు ఇన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి? ముఖ్యంగా ప్రముఖులు, వారి పిల్లలే ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు?  అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతి వేగంతో కూడిన డ్రైవింగ్‌, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు ఇలా గాలిలో కలిసిపోతున్నాయి.ఈ మధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్త లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తతో వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, అతివేగం వలన శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం, తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డు రావడం, రోడ్డు భద్రతకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ గురించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.  ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు చాలా మందే ప్రాణాలు కోల్పోయారు.

1. లాస్య నందిత మరణం
ఈరోజ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌6 రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొంది. 
మేడ్చల్ బయలుదేరే ప్రదేశం సుల్తాన్‌పూర్ ORR ఎగ్జిట్ కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.

2. అజారుద్దీన్ ఇంట విషాదం
ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్(19) మృతి చెందాడు. బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాజుద్దీన్ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

3. కోట శ్రీనివాసరావు ఇంట విషాదం
జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందారు. కోట వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరి ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చిన క్రమంలో బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడగా తలకు తీవ్ర గాయాలై మరణించారు.

4. కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు
మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వేగంగా వెళ్తున్న ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టి నుజ్జు నుజ్జుయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

5. రవితేజ సోదరుడు భరత్ రాజు
సినీ రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది, ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయారు. కారు నంబర్ ఆధారంగా భరత్‌ను గుర్తించారు.

6.మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ (క్రాష్ బారియర్)ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి(52), డ్రైవర్ స్వామిదాసు(40) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సీట్ బెల్ట్ ధరించిన కారణంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. 

శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ఆయనతోపాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాద్, దశరత్ రెడ్డి, డ్రైవర్ ‌కు కూడా గాయాలయ్యాయి. 

కోకాపేట వద్ద రెండుకార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సల్మాన్‌ అనే మెడికో మృతి చెందాడు.

ఔటర్ రింగ్ రోడ్డు అంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రింగ్ రోడ్డుపై జరుగుతన్న ప్రమాదాలతో యేటా అనేకమంది మృత్యువాతపడుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu