ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?
posted on Jun 28, 2025 10:22PM

ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలనిఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
మోహిత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఒకవైపు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ః చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు కోరడం సరికాదని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కింది కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్కు సంబంధించిన వాదనలను విజయవాడ కోర్టులోనే వినిపించి, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది. ఈ కేసుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహత్ రెడ్డిని ఏ39గా సిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల మోహిత్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే మోహిత్ రెడ్డి . విచారణకు గైర్హాజరై యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఉండగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్.. విచారణకు సహకరించకుండా వ్యవహరిస్తున్న నిందితులకునార్కోటెస్ట్ చేయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్లు నిర్వహించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు నార్కో పరీక్షలు నిర్వహించి నిజాలను రాబట్టాలని సిట్ భావిస్తోంది.