విశాఖ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు మారిన సీన్.. టెన్షన్ టెన్షన్
posted on Oct 17, 2022 4:25PM
ఎవరి వెంట ఎవరు పడుతున్నారు. జనసేన ఎక్కడకి వెడితే అక్కడ ఉద్రిక్తత నెలకొనడానికికారణం ఎవరు? జనసేన అధినేత పవన్ ను అడుగడుగునా అడ్డుకోవడమే వైసీపీ సర్కార్ లక్ష్యామాఅనిపించేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. విశాఖ గర్జన పేరిట వైసీపీ నిర్వహించిన కార్యక్రమంతో విశాఖపట్నం రెండు రోజులు అట్టుడికినట్లు ఉడికింది.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ మధ్య విశాఖ వాసులు క్షణమొక గండంగా గడిపారు. ఏంతో ముందుగా నిర్ణయించిన జనసేన జనవాణి కార్యక్రమం ఆపడమే ఏకైక లక్ష్యమన్నట్లు వైసీసీ, పోలీసులు వ్యవహరించారు. నోవాటెల్ హోటల్ ను దిగ్బంధించారు. జనసేనానిని అడుగు బయటపెట్టనియ్యకుండా అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులపై జరిగిన దాడి నెపంగా తీసుకుని పలువురు జనసైనికులపై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. చివరాఖరికి జనసేనాని విశాఖ వీడి విజయవాడ చేరుకోవడానికి నిర్ణయించుకోగానే...ఆ టెన్షన్ సీన్ గన్నవరం విమానాశ్రయానికి మారింది.
ఎందుకంటే సరిగ్గా జనసేనాని గవన్నవరం విమానాశ్రయానికి చేరుకునే సమయానికే జగన్ కూడా విమానాశ్రయానికి రానున్నారు. విశాఖ నుంచి బయలు దేరిన జనసేనాని, వేరే పర్యటనలో ఉన్నజగన్ దాదాపు ఒకే సమయానికి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయం వద్ద సీన్ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈనేపథ్యంలో పలువురు జనసైనికులను పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.