ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!
posted on Apr 10, 2025 11:07AM

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’ హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు డబల్ బెడ్ రూమ్ హామీ ఇస్తారు.
అయితే ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు.
పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్ బాగ్లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే షాలిమార్ భాగ్ నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.
ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుత వాసంలో వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు, వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు.
నిజానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం షీష్ మహల్ కట్టించారు. అయితే, షీష్ మహల్ నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోం చేసిందని అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో తెలియదు కానీ మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్ (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.
సో.. అన్నిఅరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే పరువు అసలు దక్కదని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు.
అదలా ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.