బుద్దాకి తెలుగుదేశం పెద్దల నో అపాయింట్‌మెంట్!

బెజవాడ వెంకన్నని ఇక పక్కన పెట్టేస్తారా?

అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా బుద్దా వెంకన్న కలర్ ఇస్తారు. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం ఎరుగని బుద్దాకి పొలిటికల్‌గా నోరే ప్లస్ అవుతుంది  ఎంతటి వారిపైనైనా విరుచుకుపడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనను టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది. ఒక్క టర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ తెలుగుదేశంలో తానొక్కడే నాయకుడ్ని అన్నట్లు ఫీలైపోతుంటారాయన. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు . అలాంటాయన ప్రస్తుతం పదవి కోసం, గుర్తింపు కోసం పడుతున్న పాట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
 ఎన్ని చేసినా పార్టీ తనను కరుణించడం లేదని తెగ బాధపడిపోతున్నారట మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.  ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు, ఎన్ని తిప్పలు పడినా ఎవరూ పట్టించుకోవడం లేదని లబోదిబోమంటున్నారట. తనకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇప్పించమని పార్టీ పెద్దలందరి దగ్గరా మొత్తుకుటున్నారట. ఎమ్మెల్సీ రేసులో తాను ఉన్నానని తన పేరు కాస్త వేయండని మీడియా వాళ్లకి ఫోన్లు చేసి మరీ బతిమాలుకుంటున్నారట. 

తనకు తానుగా ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఫీలయిపోయే ఆ విజయవాడ టీడీపీ నాయకుడికి  ఏ లాబీయింగ్ కలిసి వచ్చిందో ఏమో కాని తెలుగుదేశం పార్టీలో  ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది . దాంతో మామూలుగానే మాస్ ఇమేజ్ ఉన్న ఆయన దూకుడు మరింత పెరిగిపోయింది . తెలుగుదేశం ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న.  ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి,  కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు. బుద్దా వెంకన్న దూకుడు టీడీపీకి ఎంత ప్లస్ అయిందో, అంతే మైనస్ అయిన సందర్భాలూ   ఉన్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లపై నోటికొచ్చినట్లు చెలరేగిపోయే  మాజీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్దా వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు, బుద్దా వెంకన్న అడ్డంపడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు .

ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో  విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్దా చాలా హడావుడే చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు. భారీ బల ప్రదర్శనతో ఇంద్రకిలాద్రీ కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు. అయినా వెంకన్నకు టికెట్ రాలేదు కానీ,  అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చీవాట్లు పెట్టింది. 

ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వడంతో ఆ పదవిపై కన్నేసిన ఆయన మళ్లీ తన స్టైల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారట. గుర్తింపు కోసం పార్టీ చెప్పకపోయినా సరే.. ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ  బ్రేకింగులు వేయించుకునేవారాయన. చివరికి ఆయన ప్రెస్ మీట్ల దెబ్బకి మీడియా వాళ్లు..కూడా బాబోయ్ బుద్దా వెంకన్నా అనాల్సి వస్తోందంట. ఎక్కడికీ కదలకుండా తన ఇంట్లోనే కూర్చుని ప్రతి రోజూ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్లు పెట్టడాన్ని భరించలేక మీడియా వాళ్లు కూడా ఇక మేం రాలేం అన్నారట. ఆ తర్వాత కాస్త ప్రెస్ మీట్లు తగ్గించారు బుద్దావెంకన్న. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని న్యూస్ ఛానెల్స్ ను బ్యాన్ చేసింది. అయితే బుద్దా వెంకన్న ఆ ఛానెల్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటూ, ఆ ఛానెల్స్ లో తన బ్రేకింగ్స్ ఎక్కువ వచ్చేట్టుగా ప్లాన్ చేశారట. పాపం అదే బుద్దావెంకన్నకు మైనస్ అయ్యిందట. తాము ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేస్తే నువ్వు ఆ ఛానెల్స్ వాళ్లతోనే ఎక్కువగా టచ్ లో ఉండడం ఏంటని పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.

 రెండోసారి తనకు ఎమ్మెల్సీ కావాలంటున్నారు బుద్దావెంకన్న. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ వాయిస్ తానే వినిపించానని, చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వస్తే తానే అడ్డుకున్నానని, గతంలో కొడాలి నానిని తానే ఎదుర్కున్నానని అలాంటి తనకు ఎమ్మెల్సీ కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటున్నారట. పైగా తాను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిననీ, తాను గవర కులానికి చెందిన వాడిని కాబట్టి బీసీ కోటాలో అయినా తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట.

 ఎన్నికల సమయంలో బుద్దావెంకన్న చేసిన ఓవరాక్షన్ కి టీడీపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది. బుద్దా బ్లడ్ ఎపిసోడ్‌పై పార్టీ పెద్దలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారంట. అలాగే మీడియాలో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని కోపంతో ఉన్నారంట. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులు గా చంద్రబాబు, లోకేశ్‌లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట.. ఎక్కడ అపాయింట్‌మెంట్ ఇస్తే తనకు ఎమ్మెల్సీ అంటారో అని పార్టీ పెద్దలు   బుద్దావెంకన్నను కలవడానికి  కూడా ఇష్టపడటం లేదంట . దాంతో ఆయన  తన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక నెత్తినోరు బాదుకుంటున్నారట

Online Jyotish
Tone Academy
KidsOne Telugu