వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదు!
posted on May 14, 2020 5:58PM
వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని ఆమె ప్రకటించారు. రేషన్కార్డు లేని వాళ్లకు కూడా ఈ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ఇది వలస కార్మికులకు ఊరట కలిగించే విషయం.
ఈ పథకం ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధి పొందబోతున్నారని వివరించారు. ఇందు కోసం రూ. 3500 కోట్లు కేటాయిస్తున్నామని, వలస కార్మికులకు కేంద్రం అందించే ఆహార ధాన్యాలు చేరవేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని నిర్మల స్పష్టం చేశారు. కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో, అందరికీ ఆహార ధాన్యాలు అందేలా చూడాల్సిన బాధత్య రాష్ట్రాలదేనని ఆమె తేల్చిచెప్పారు. రెండు నెలల్లో 11 వేల కోట్లు కేంద్రం నిధులను ఖర్చుపెట్టుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించినట్లు తెలిపారు.
కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికులను రప్పించుకునేందుకు సంస్థలకు అవకాశం కల్పించామని, అలాగే సంస్థలతో నేరుగా ఒప్పందం చేసుకున్న కార్మికుల హక్కుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించామని నిర్మల వెల్లడించారు.