టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్?

కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. నారా లోకేష్‌ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నారంట.

 ఇకపై ఒక నేతకు ఒకే పదవి రెండు సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారంట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్‌ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు. 

నారా లోకేశ్  యూత్‌కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకూ లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు.

అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారంట. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయ‌న అడుగులు వేస్తున్నట్టు ప‌నితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91వేల 839 కోట్ల పెట్టుబ‌డులు, ఒక లక్షా 41వేల 407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్‌ను పార్టీపరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహద పడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో?