లాక్ డౌన్ వేళ మావంతు సాయం చేస్తున్నాం: నారా భువనేశ్వరి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. సంక్షోభ సమయంలో సేవ చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. లాక్ డౌన్ వేళ తెలుగు రాష్ట్రాల్లో తమవంతు సాయం చేస్తున్నామని వెల్లడించారు. భౌతికదూరం పాటిస్తూ ఇప్పటివరకు 20 వేల మంది పేదలకు నిత్యావసరాలు అందించామని, బియ్యం, నూనె, పండ్లు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేశామని వివరించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 లక్షల మందికి ఎస్ఎస్-99 మాస్కులు అందించామని భువనేశ్వరి తెలిపారు. 3 వేల మంది కూలీలకు పులిహోర, బిస్కెట్లు పంపిణీ చేశామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తోందని, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 5,000 యూనిట్లు పంపిణీ చేశామని వివరించారు.