పట్టువీడలేదు... పదవి దక్కేనా!

 

 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పార్టీ ఏర్పాటు చేసి తరువాత అన్నింటినీ పక్కన పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ నుంచి ఓ పెద్ద పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా మృతి చెందారు. అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1978 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. ఆయన మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే.. ఆ తరువాత ఓటమి చవి చూసారు. 

అనంతరం 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా కూడా పదవులు అధిరోహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ , అజహరుద్దీన్ తో కలసి వివిధ స్థాయిల్లో క్రికెట్ ఆడారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అనివార్యంగా ప్రవేశించారు. నిజాం కాలేజీలో నందమూరి బాలకృష్ణ.. కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి గా పని చేశారు.ఆయన సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన తరువాత గత ఎన్నికల వరకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు.2024 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 

తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వాక్చాతుర్యం తో రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ పై స్పందించే రీతిలో ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో జిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించారు. 

గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన.. తన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని పీలేరు ఎమ్మెల్యే గా గెలిపించారు. పావు నరసింహారావు ఆశీస్సులతో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కిరణ్ కుమార్ రెడ్డి తండ్రికి ఉన్నా అది నెరవేరలేదు... తండ్రిఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చారు.  తన ఇంట్లో అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. నేటికి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. తమ ఇంటి గడప వద్దకు వచ్చి ఏమి కావాలనే అడిగితే అది జరుగుతుంది అన్నది నియోజకవర్గ ప్రజల మాట. కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం దృష్ట్యా బీజేపీ పార్టీ ఆయనకు అత్యున్నత స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.