సుప్రీంలో ర‌ఘురామ‌కు ఊర‌ట‌.. ఆర్మీ ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు..

ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. 

ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. 

అంత‌కుముందు.. సుప్రీంకోర్టులో ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌పై వాడి-వేడి వాద‌న‌లు జ‌రిగాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ కేసుపై విచార‌ణ చేపట్టింది. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. 

బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు. 

కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని చెప్పగా.. సమీపంలోని ఏపీలో లేదా తెలంగాణలో ఆర్మీ ఆస్పత్రి ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో ఉందని.. అక్కడి నుంచే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని ఆదినారాయణరావు తెలిపారు. ఆంధ్రాలో విశాఖపట్నంలో నేవల్‌ బేస్‌ ఆస్పత్రి ఉందని.. అది కూడా 300 కి.మీ కంటే ఎక్కువ దూరమని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత రఘురామ వైద్యపరీక్షలకు 10కి.మీ దూరంలో విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. వైద్య పరీక్షలకు ఢిల్లీ ఎయిమ్స్‌ మంచిదని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తో కొన్ని భయాలు ఉన్నాయని.. అక్కడి పాలకమండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆయన కోరారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేసినందున చాలా ఇబ్బందులు ఉన్నాయని రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఎయిమ్స్‌కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా అన్నారు. పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ఎస్‌జీ వ్యాఖ్యానించగా.. ఇందులో రాజకీయం లేదని.. ఒక న్యాయాధికారిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని దవే కోరారు. 

అనంత‌రం.. రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.