మోడీ దీక్ష ప్రారంభం.. చంద్రబాబు కౌంటర్..
posted on Apr 12, 2018 10:48AM
విపక్షాలు పార్లమెంట్లో సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని.. దానిని నిరసిస్తూ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నేడు ఉపవాసదీక్షను ప్రారంభించారు. ఇక మోదీకి తోడుగా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో బీజేపీ శ్రేణులు నిరాహారదీక్షలు చేస్తున్నాయి. అంతేకాదు నేడు అత్యధిక సమయం ఇంటివద్దనే గడపనున్న మోదీ, అక్కడి నుంచే తన బాధ్యతలను నిర్వహించనున్నారు. ఆపై మధ్యాహ్నం తరువాత తిరువనంతపురానికి బయలుదేరి వెళ్లే మోదీ, అక్కడ రక్షణరంగంపై ఓ సదస్సును ప్రారంభిస్తారు.
ఇదిలావుండగా నరేంద్ర మోదీ దీక్షపై ఏపీ సీఎం చంద్రబాబు కౌంటరేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమపై నిందలేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ రభసకు కారణం మోదీయేనని వ్యాఖ్యానించిన ఆయన, తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకునే సమయంలో సభ ఆర్డర్ లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.