కోవూరు కొలిమి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలతో కాక
posted on Jul 8, 2025 2:21PM

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే.. నోటి దురుసు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతోంది.
స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే.. వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడ్డమేంటన్న చర్చకు తెరలేచింది. నల్లపరెడ్ల పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు. అంతే కాదు.. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలు అన్నారు. వీపీఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని.. ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సిట్టింగులు వేసినట్టుగా తనకు సమాచారముందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. పోయి పోయి పలు చోట్ల తిరిగి పీహెచ్డీలు చేసొచ్చిన.. ప్రశాంతిరెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే.. ఒక మంచి కన్నెపిల్లను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడ్నని అనడంతో ఇప్పుడు కోవూరు మొత్తం కొలిమిలా తయారైంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. తెలుగుదేశం- వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయ్యింది.
అదలా ఉంటే తనపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక్క మహిళా ఎమ్మెల్యేగా తాను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే..సభ్య సమాజం చెవులు మూసుకునే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత భాషా ప్రయోగం చేశారని విమర్శించారు. అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి మా నోరు మూయిద్దామనుకుంటున్నావా? అని నిలదీశారు. ఒక మాజీ మంత్రి అయి ఉండీ మహిళల పట్ల ఇంత నీచంగా, అసభ్యంగా మాట్లాడడాన్ని బట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తోందన్నారు.
ఇక ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చెప్పుకోలేని బాధలు అనుభవించిన చాలా మందిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చన్నారు. అయినా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న అన్న ఆమె.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇళ్లల్లోని మహిళలకు వినిపించగలరా అని నిలదీశారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.