ఎంఐఎం 'రాయల తెలంగాణ'
posted on Nov 6, 2013 11:50AM
''రాయల తెలంగాణ ప్రకటిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హైదరాబాద్ని యూటీగా ప్రకటించవద్దు. తాత్కాలికంగా కొంత కాలం ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవచ్చు. అయితే, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం, వనరుల పంపిణీపై నిర్దుష్టమైన విధానాన్ని ఖరారు చేయాలి'' అని మజ్లిస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి సూచించింది. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి.
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే నదీ జలాల వివాదాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉత్పన్నం కావని స్పష్టం చేసినట్టు తెలిపింది. సాంస్కృతికంగా తెలంగాణ- రాయలసీమ ప్రజల మధ్య సారూప్యత ఉందని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్లో శాంతి భద్రతల బాధ్యతను కేంద్రం తన పరిధిలోకి తీసుకోరాదని, రాజధానిలో సీమాంధ్రుల హక్కుల పరిరక్షణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వలసవాదులు, సీమాంధ్రులు అనే నిర్లక్ష్య భావంతో చూసే వారిపై కఠినంగా వ్యవహరించేలా చట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని కేంద్రమని స్పష్టం చేశారు. విభిన్న మతాలు, కులాల ప్రజలు నివసించే కేంద్రంగా హైదరాబాద్ సంస్కృతి విశ్వవిఖ్యాతి పొందిందని, స్థానిక సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు విఘాతం కలిగించకుండా విభజనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు తెలిసింది.