మావో సుప్రీం కమాండర్.. అలిపిరి దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో హతం
posted on May 21, 2025 2:00PM

ఛత్తీస్ గఢ్ లో బుధవారం (మే 21) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి సూత్రధారి నంబాల కేశవరావు అలియాస్ గగన్నా కూడా ఉన్నారు. 2012లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మెరుపుదాడిలోనూ నంబాల కేశవరావుదే ప్రధాన పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట అని చెబుతారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేశాడు నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజం పట్ల ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు.
శ్రీకాకుళం జిల్లా జియన్న పేట నంబాల కేశవరావు స్వస్థలం. ఈయన 1955లో జన్మించిన ఆయన వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మునుపటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్ పూర్తి చేశారు. 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2004లో పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం మాజీ యోధుల దగ్గర శిక్షణ పొందారు. నంబాల కేశవరావు మావోయిస్టులు జరిపిన పలు దాడులలో కీలక పాత్ర పోషించారు. 2010లో దంతేవాడలో 76 సీఆర్పీఎప్ జవాన్లు హతమైన దాడిలో నంబాల కేశవరావుదే కీలక పాత్ర.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా ఉన్న నంబాల కేశవరావు బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. నంబాల కేశవరావుపై రూ. కోటీ 30 లక్షల రివార్డు ఉంది. నంబాల కేశవరావు మృతి మావోయిస్టులకు తేరుకోలేని ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.