ప్రధాని మోడీతో లోకేష్ భేటీ.. ముప్పావుగంట సమావేశంలో ఏం జరిగిందంటే?

 

ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తన హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం (సెప్టెబర్ 5)  భేటీ అయ్యారు.  దాదాపు  45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో నారా లోకేష్ రాష్ట్రానికి  పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర మద్దతు రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపైచర్చించారు.  ఈ భేటీ సందర్భంగా  లోకేష్ ప్రధానికి యోధాంధ్రపై రూపొందించిన టేబుల్ బుక్ ను బహూకరించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రధానికి ధ్యాంక్స్ చెప్పారు. ఈ తగ్గింపు విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రణాళికలో సింగపూర్ పాత్ర గురించి కూడా లోకేష్ మోడీకి వివరించారు.  

గతంలో అంటే మే 17న ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఆ భేటీకి ఇప్పుడు తాజాగా జరిగిన భేటీ కొనసాగింపుగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, టెక్నాలజీ, ఇరిగేషన్ రంగాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను మోడీకి వివరించి ఆయా ప్రాజెక్టులు సత్వరం గ్రౌండ్ అవ్వడానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ మోడీని కోరినట్లు తెలుస్తోంది.  ఇవే కాకుండా ఈ 45 నిముషాల భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన వివరాలను కూడా ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది.

సిట్ దర్యాప్తు ఆధారంగా మరి కొందరి పేర్లు చేర్చుతూ మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ చార్జిషీట్ లో ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు పేరు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో లోకేష్ ప్రధానితో భేటీ కావడం, ఆ భేటీలో మద్యం కుంభకోణం దర్యాప్తు పురోగతిని వివరించినట్ల ప్రచారం జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  మొత్తం మీద కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ భేటీని తార్కానంగా చెబుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu