బాబు అరెస్టు.. కేసీఆర్ హౌస్ అరెస్ట్.. లింకుందా?
posted on Oct 4, 2023 9:17AM
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడంపై దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు ఆందోళన బాట చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో నినదిస్తున్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు.
అయితేచంద్రబాబు అరెస్ట్పై సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికార అగ్రనేతలు.. అంటే కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం థియేటర్లో సినిమా ప్రారంభమైన తర్వాత.. సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయింది. సమీక్షకుడిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం ఏపీలో ఎవరినో అరెస్టు చేస్తే తెలంగాణకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించి.. విమర్శలను ఎదుర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అనంతరం చోటు చేసుకొంటున్న ప్రతి అంశాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. మినిట్ టు మినిట్.. నివేదికను తెప్పించుకొంటున్నట్లు వరుస కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక చంద్రబాబు అరెస్ట్ పక్క రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల పంచాయతీ అని, దీనితో తమకేమి సంబంధమంటూ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని సెటిలర్లలో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. అ సంగతి ఇంటెలిజెన్స్ నివేదిక రూపంలో ఇప్పటికే కేసీఆర్కు అందిందనీ, ఆ నివేదిక చూసి ఆయనగారు గాభరా పడ్డారని పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైరల్ ఫీవర్ అంటూ ప్రగతి భవన్ కే పరిమితమై తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నారంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్పై బీఆర్ఎస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించడంతో.. తెలంగాణలోని ఆంధ్రుల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, అలాగే ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల ఆందోళనలపై పోలీసులు ఉక్క పాదంమోపడం వెనుక కేసీఆర్ ప్రభుత్వం తెర చాటు రాజకీయాన్నిఅమలు చేసిందని సెటిలర్లు భావిస్తున్నారు.
అదీకాక బాబు అరెస్ట్పై మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్లుడు పట్టుకొని తెలుగు వారు శాంతియుతంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ... అక్కడెక్కడో బాబు అరెస్ట్ జరిగితే.. ఇక్కడ ఈ గోల ఏమిటని కస్సు బస్సులు ఆడడం లేదని.. కానీ చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవితలు కారాలు మిరియాలు నూరడం ఏమిటన్న ఆగ్రహం సామాన్య ప్రజలలో సైతం వ్యక్తం అవుతోంది. అలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. సాక్షాత్తూ తెలంగాణ స్పీకరే చంద్రబాబు అరెస్టును ఖండించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
అదీకాక.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపునకు కేసీఆర్ సహకరించారని.. ఆ సహాయ సహకారాలు నేటికి కొనసాగుతోన్నాయన్న అభిప్రాయం తెలుగు వారిలో బలంగా వ్యక్తం అవుతోంది. ఇక చంద్రబాబు అరెస్ట్తో ఆంధ్రులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పది వేల నుంచి 40 వేల ఓట్ల వరకు కారు పార్టీకి కోత పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయనే ఓ ప్రచార సాగుతోంది.
మొత్తంగా చూస్తే.. తెలంగాణలో నిమొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో ఓ 50 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పై చంద్రబాబు అరెస్టు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఫ్యామిలీ గ్రహించిందని.. అందుకే.. కేసీఆర్ సమీప బంధువు,మంత్రి హరీష్ రావు.. రంగంలోకి దిగి.. చంద్రబాబు అరెస్ట్పై స్పందించారని కానీ అప్పటికే కేటీఆర్ వ్యాఖ్యలతో కారు పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. హరీష్ రావు ప్రకటన నష్టనివారణకు ఏమాత్రం దోహదం చేయలేదని చెబుతున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్.. పార్టీ నేతలతో భేటీ అయితేనో, ప్రెస్మీట్ పెడితేనో.. చంద్రబాబు అరెస్ట్పై స్పందించాల్సి ఉంటుందని.. ఆ భయంతోనే ఆయన బయటకు రావడం లేదని అంటున్నారు.
ఏదీ ఏమైనా.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినా, పాలు చల్లినా అది ఆంధ్రా సెటిలర్లపైనేే ఉందని అంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలను గమనిస్తే.. గతంలోలా సెటిలర్లు బీఆర్ఎస్ కు సహకరించే అవకాశాలు అయితే లేవని అంటున్నారు. అదలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని అటు బీజేపీ... ఇటు కాంగ్రెస్ తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.. చేస్తున్నాయి. ఇక తెలంగాణలో తెలుగుదేశం సైతం సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటున్నది.దానికి ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఆగ్రహం తోడు కావడంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కల నెరవేరడం సులభ సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.