మైనంపల్లి వెనుక కేటీఆర్? హరీష్ కు చెక్ పెట్టేందుకేనా?
posted on Oct 4, 2023 9:46AM
కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ ఓ విషయం మనం మాట్లాడుకోవాలి. అదేమిటంటే మైనంపల్లి హనుమంతరావు సొంత జిల్లా గతంలో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ లో హరీష్ పెత్తనం కారణంగా ఆయన జిల్లాలో రాజకీయాలు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తన కుమారుడి కోసం హరీష్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయి… ఉమ్మడి మొదక్ జిల్లా బాధ్యతల్ని తీసుకున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ కంచుకోటలపై దృష్టి పెట్టారు. రామాయంపేటకు చెందిన మైనంపల్లి గతంలో తెలుగుదేశం మెదక్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. మైనంపల్లి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ మెదక్ పై దృష్టి పెట్టారు. నర్సాపూర్ బాధ్యతల్ని కూడా తీసుకునేదుకు సిద్ధమయ్యారు. మెదక్ సొంత జిల్లా కావడంతో పాటు కార్యకర్తల్ని ఆదుకుంటారన్న పేరు ఉండటంతో మెదక్తో పాటు నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఆయనకు ఊరూరా అనుచగణముంది. వారినీ యాక్టీవ్ చేస్తున్నారు. మైనంపల్లి రోహిత్ మెదక్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్ పేరిట ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని గ్రామాల్లోనూ అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, ఇండ్లు, కమ్యూనిటీహాల్స్ నిర్మాణం, వైద్య, విద్య అవసరాల కోసం సాయం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు.
నర్సాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డికి ఇవ్వడం లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్లో కి లాగేందుకు మైనంపల్లి ప్రోత్సహిస్తున్నారు. మైనంపల్లి దూకుడు హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం నుంచీ హరీష్ రావు పెత్తనమే నడుస్తోంది. అక్కడ కనుక పట్టు కోల్పోతే హరీష్ రావుకు రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు మెదక్ జిల్లాపై పట్టు కోల్పోతే.. ఇక పార్టీలో ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ పార్టీలో కేసీఆర్ తరువాత నంబర్ టూ స్థానం కోసం కేటీఆర్ తో పోటీ పడుతున్నది హరీష్ రావేనని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అటువంటి హరీష్ రావుకు మెదక్ జిల్లాపై పట్టు జారితే.. ఇక ఆయన కేటీఆర్ కు సమఉజ్జీగా ఉండే అవకాశమే లేదు. అందుకే స్వయంగా కేటీఆరే మైనంపల్లిని హరీష్ కు వ్యతిరేకంగా ప్రొత్సహించి పెంచారా అన్న అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మైనంపల్లికి చెక్ పెట్టేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. మైనంపల్లిని దెబ్బతీయడానికి అంది వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికి తనదైన స్టైల్లో వ్యూహాలు రచిస్తున్నారు. ఫలితం ....
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల..ఆ పార్టీ బలం ఎంత పెరిగిందో తెలియదు గాని.. రెండు వికెట్లు పడిపోయాయి. దీని వెనుక హరీష్ రావు హస్తం వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. మెదక్ సీటు మైనంపల్లి తనయుడికు కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేత కంటారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
మరో పక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు మైనంపల్లి కేంద్రంగా అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. మైనంపల్లికి, ఆయన కుమారుడికీ కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. తమకు కూడా డబుల్ టికెట్లు కావ్వాల్సిందే అంటున్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని చెప్పింది. ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో పార్టీ సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు.
అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చి మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లికి మినహాయింపు ఇచ్చినట్లే తమకూ మినహాయింపు ఇచ్చి తమ కుటుంబాలకు కూడా రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అంటే సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు.
అయితే మైనంపల్లిది ప్రత్యేక కేసుగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నది. ఇందుకు బలమైన కారణమే వుంది. మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. ఈ నేపథ్యంలోనే మెదక్ కాంగ్రెస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కుమారుడు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
మైనంపల్లి హన్మంతరావు రాకతో మరో ముఖ్యనేత కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. మొదటి నుంచి మైనంపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఉదయ్పూర్ తీర్మానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం, బీసీనేతనైన తనను కాంగ్రెస్ పార్టీ అణగకదొక్కడం బాధించిందని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నందికంటి శ్రీధర్ లేఖలో వెల్లడించారు.
గ్రౌండ్ లెవెల్లో చూస్తే మల్కాజిగిరిలో బిఆర్ఎస్కు పట్టు ఉంది. పైగా అక్కడ బిఆర్ఎస్ అభ్యర్ధిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లే. దీంతో ఇక్కడ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. మల్కాజిగిరిలో బిఆర్ఎస్ బలమైన పార్టీ.. అయితే మైనంపల్లికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల బిఆర్ఎస్ బలం కాస్త తగ్గవచ్చు. అటు కాంగ్రెస్కు కొంత బలం ఉంది. అది కలిసిరావచ్చు. మల్లారెడ్డి అల్లుడు ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత..దీంతో గట్టి పోటీ తప్పదు. అయితే మైనంపల్లి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. అటు కాంగ్రెస్ ఓటింగ్ కూడా కలిసిరావచ్చు. దీంతో మల్కాజిగిరి పోరు ఈ సారి రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.
కాకపోతే ఇక్కడ బిజేపికి కూడా ఒకింత పట్టు ఉండటంతో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో గెలుపు ఎవరికీ నల్లేరుమీద బండినడక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మైనంపల్లి తనయుడు పోటీ చేసే మెదక్ నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగానే ఉంటుందని అంటున్నారు. హరీష్ రావు.. మైనంపల్లిని, కాంగ్రెస్ ను బలహీనం చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనీ, మైనంపల్లిని దెబ్బకొట్టగలిగితే.. తన పట్టు నిలుపుకోవడమే కాకుండా, కేటీఆర్ కూ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.