భారీ ర్యాలీతో టీడీపీ గూటికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ తిరుగుబాటు  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం (మార్చి 24) తెలుగుదేశం గూటికి చేరనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో గిరిధర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.    

నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపిన గిరిధర్ రెడ్డి.. నెల్లూరు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీగా అమరావతి చేరుకోనున్నారు.    గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు.    గిరిధర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు.

ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆ నేపథ్యంలోనే వైసీపీను వీడాలని గిరిధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ముందు ముందు గిరిధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గురువారం (మార్చి 23) జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని కాదని ఆత్మప్రభోదానుసారం ఓటు వేసిన సంగతి తెలిసిందే.