15 సార్లు బడ్జెట్ కూర్పు.. మాటల మాంత్రికుడు! పదవులకే వన్నె తెచ్చిన రోశయ్య..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొణిజేటి రోశయ్యది ప్రత్యేక స్థానం. రాజకీయ విలువలకు కట్టుబడి ఆయన ప్రస్థానం కొనసాగించారు. చివరి వరకు నిలుపుకున్నారు. తాను ఏ బాధ్యత తీసుకున్నా.. ఆ పదవికే వన్నె తెచ్చారు రోశయ్య. దాదాపు ఐద దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు .  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య... వైఎస్సార్‌ మరణానంతరం.. 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు పదవిలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వహించారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు నిర్వహించారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను రోశయ్య 15 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.

1968-85: శాసనమండలి సభ్యుడు
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు
2009: సెప్టెంబరు - 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
2011: ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్‌
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu