దాడితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు: కొణతాల
posted on May 14, 2013 6:37PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ముందస్తు ఒప్పందం చేసుకోన్నాక, శాసనమండలికి పంపలేదనే వంకతో తెలుగుదేశం పార్టీలోంచి బయటపడ్డ దాడి వీరభద్రరావు, తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన కొణతాల రామకృష్ణతో చేతులు కలిపి పనిచేసేందుకు తానూ సిద్దం అని ఇటీవల ప్రకటించారు. అయితే, తనతో కలిసి పనిచేసేందుకు ఆయన సిద్దమేమో గానీ, తానూ మాత్రం ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కొణతాల రామకృష్ణ ఈ రోజు కూడా మరో మారు స్పష్టం చేసారు. తానూ పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తునట్లే, తన అభిప్రాయాలకు కూడా పార్టీ గౌరవించాలని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఎలాగో కష్టపడి కొండా సురేఖ దంపతులను బుజ్జగించి దారికి తెచ్చుకోగలిగారు. కానీ, కొణతాల రామకృష్ణ-దాడి విషయంలో మాత్రం చిక్కు ముడి విప్పడం కష్టమే. ఎందుకంటే ఇద్దరు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వారే అవడంతో, ఇద్దరికీ తమ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండాలని భావించడం సహజమే. అయితే, పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉండిన కొణతాల మాటకు విలువీయకపోతే, అతనితో బాటు అతని అనుచరులు కూడా వేరే పార్టీలోకి తరలిపోవడం ఖాయం. అప్పుడు ఆయనని ఎదుర్కోవడానికే పార్టీ శ్రమించాల్సి ఉంటుంది. అంతకంటే, ఆయన మాటను గౌరవిస్తూ, దాడికి వేరే ఇతర భాద్యతలు అప్పగిస్తే మేలేమో!