కావూరికి సమైక్య సెగ
posted on Sep 17, 2013 3:14PM
కావూరి సాంబశివరావు ఇంటిని సమైక్య వాదులు ముట్టడించారు. వీరిలో సమైక్యవాదం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు కూడా ఉన్నారు. సీమాంధ్రను ఎడారి చేసే తెలంగాణ విభజన ప్రకటన వచ్చి యాభై రోజులు కావస్తున్నా కనీసం రాజీనామా చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఇంటికి వెళ్తున్న కావూరిని ఎయిరు పోర్టులో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసుల జోక్యంతో తప్పించుకున్నారు. మళ్లీ కలపర్రు గ్రామం వద్ద సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. దీంతో వాహనాలు ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఇక చేసేది లేక కావూరీ పోలీసుల రక్షణతో వేరే కారులో వెళ్లిపోయారు. అయినా సమైక్యవాదులు శాంతించలేదు. ఆయన ఇంటిని ముట్టడించారు. కావూరి ఇంట్లో ఫర్నీచరు ధ్వంసం చేశారు. రాజీనామా చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇంతలో కావూరి వర్గం సమైక్యవాదులపై గొడవకు దిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని కావూరి సాంబశివరావు మీడియాతో చెప్పారు. విభజన వల్ల నష్టాలు ఎక్కువే అన్నారు.