కోడి కత్తి డ్రామా.. సంబంధం లేని రెస్టారెంట్ యాజమాన్యంపై జగన్ బ్యాచ్ వేదింపులు
posted on May 12, 2024 12:40PM
కోడి కత్తి డ్రామా ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి సుపరిచితమే. జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం కావడానికి ప్రధాన కారణాల్లో ఈ ఘటన కూడా ఒకటి. కోడి కత్తి డ్రామా, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలతో జగన్ కు ప్రజల్లో సానుభూతి పెరిగి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. విపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయించడం.. వారిని జైల్లో పెట్టి పోలీసులతో కొట్టించడం ఇలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై గళమెత్తిన ప్రతి ఒక్కరిని జగన్ టార్గెట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. జగన్ కక్షపూరిత రాజకీయాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురైన వారిలో విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్లో రెస్టారెంట్ ఓనర్ కూడా ఒకరు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశారు. శ్రీనివాస్ పని చేస్తున్నది.. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లోనే. ఈ ఘటనలో అభశుభం తెలియని రెస్టారెంట్ ఓనర్ ని జగన్, ఆయన బ్యాచ్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ఇబ్బందులకు గురి చేశారు. తాజాగా జగన్ ప్రభుత్వంలో వారికి ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ రెస్టారెంట్ ఓనర్ సతీమణి ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రజలు.. అయ్యబాబోయ్.. జగన్, ఆయన బ్యాచ్ వారిని ఇంతగా ఇబ్బందులకు గురి చేశారా అని ఆశ్యర్య పోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో శ్రీనివాస్ అను వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. జగన్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్న సమయంలో విమానాశ్రయంలో ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్పై కత్తితో దాడి చేశారు. ఆ దాడి ఘటనకు ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ యాజమాన్యానికీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం జగన్ పై ప్రజల్లో సానుభూతి పెంచేందుకు మాత్రమే తాను ఈ దాడికి పాల్పడ్డానని నిందితుడు శ్రీనివాసరావు బహిరంగంగానే చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత రెస్టారెంట్ యాజమాని తొట్టెంపూడి హర్షవర్దన్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వచ్చింది.
బిజినెస్ చేయడం చేతకాక నాశనం అయింది అంటే దానికి ఆ యాజమానే బాధ్యుడు అవుతాడు. కానీ, పని గట్టుకొని ప్రభుత్వమే జరుగుతున్న బిజినెస్ ను క్లోజ్ చేసి పైశాచిక ఆనందం పొందినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థకాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అదే పరిస్థితి విశాఖ విమానాశ్రయంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎదురైంది. లేని పోని ఆరోపణలు చేసి హర్షవర్దన్ కుటుంబంతోపాటు అందులో పనిచేసే ఎంతో మందిని జగన్ ప్రభుత్వం రోడ్డుపాలు చేసింది. జగన్ ప్రభుత్వం హర్షవర్దన్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించడానికి .. కోడికత్తి ఘటన కంటే ఆయన తెలుగుదేశం సానుభూతి పరుడుగా ఉండటమే ప్రధాన కారణం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఎన్టీఆర్, చంద్రబాబు అంటే హర్షవర్దన్ కు ఇష్టం. దీనిని జగన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక పోయారు. కోడికత్తి దాడి ఘటనలో హర్షవర్దన్ కు ఎలాంటి సంబంధం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. నిందితుడు శ్రీనివాస్రావు కోడికత్తి దాడి ఘటనకు కొద్ది నెలల ముందునుంచే రెస్టారెంట్ లో సర్వర్గా పని చేస్తున్నాడు. పైగా జగన్ అంటే నిందితుడికి అభిమానం. కానీ, అభంశుభం తెలియని రెస్టారెంట్ యాజమాన్యంపై జగన్ ప్రభుత్వం కేవలం తెలుగుదేశం సానుభూతి పరుడు అనే కారణంతో కక్షపూరితంగా వ్యవహరించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హర్షవర్దన్ సతీమణి తొట్టెంపూడి శ్రీధేవి సొంత పేపర్ ఉందని తమపై జగన్ మీడియా ఇష్టమొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నబాబు చిరుతిండ్లు అని సాక్షి మీడియాలో పెద్దపెద్ద హెడ్డింగ్లు పెట్టి లోకేశ్ మా రెస్టారెంట్లో చిరుతిండ్లు తింటే ఆ బిల్లులు మేము అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వానికి సబ్మిట్ చేశామని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా చెప్పాలంటే మా రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నది లోకేశ్ కాదు.. వైసీపీ మంత్రులు, నాయకులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు ఆ వీడియోలో చెప్పారు. కలెక్టరేట్ నుంచి మాకు రావాల్సిన బిల్లులు ఇప్పటికీ ఇవ్వకుండా ఆపేశారని చెప్పారు. హర్షవర్దన్ లిక్కర్ డాన్, ఎవరికో బినామీ అని జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. నేను నమ్ముకున్న బాబా సాక్షిగా చెబుతున్నా అవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.