హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్ట్.. భారత సైనిక సమాచారం పాక్‌కు చేరవేత

 

భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు  చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

 మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది. డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.