బీజేపీ-జనసేన పార్టీల దోస్తీ.. భయపడేది లేదంటున్న వైసీపీ!!
posted on Jan 16, 2020 11:41AM
ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇరు పార్టీ నేతల మధ్య కీలక సమావేశం జరుగుతోంది. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి హోటల్ లో జరుగుతోన్న ఈ భేటీ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజు హాజరుకాగా.. జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ, ప్రజా సమస్యలు, అమరావతి అంశాలపై వీరు లోతుగా చర్చిస్తున్నారు. బీజేపీ, జనసేనలు చేతులు కలపడంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం.. బీజేపీ-జనసేన కలిసినా తమకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేస్తోంది.