చంద్రబాబు పై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు... ఎన్ని రైళ్లు తగలబడతాయో తెలియదు..

 

వైసీపీ పార్టీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరిన విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పదే పదే కోరడం వల్లే తాను టీడీపీలోకి చేరానని.. ఏమాత్రం తేడా వచ్చినా రివర్సు గేర్ వేస్తానని పార్టీలో చేరినప్పుడే తాను చంద్రబాబును హెచ్చరించానని ఆయన అన్నారు. అంతేకాదు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ... కాపు ఉద్యమంలో రైలును తగలబెడితే భయపడ్డారని, ముస్లింలకు ఏదైనా తేడా వస్తే వెనకా ముందూ ఆలోచించనని, ఎన్ని రైళ్లు తగలబడతాయో తెలియదని చంద్రబాబుతో స్వయంగా చెప్పానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని.. ఒక్క అల్లాకి మాత్రమే భయపడతానని చెప్పారు. ఇంకా గతంలో తాను బీకాంలో ఫిజిక్స్ అన్న మాటలపై కూడా స్పందిస్తూ..మీడియా ఫేక్ మీడియా..తన వీడియోలో పంచ్ డైలాగ్స్ ను మాత్రమే ఎడిట్ చేసి వాడుకున్నారని మండిపడ్డారు. మరి జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా సమాధానం చెబుతారో చూడాలి.