తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..జల వివాదం సద్దుమణిగేనా?

 

తెలుగు రాష్ట్రాల్లోని జల వివాదలను చర్చించేందుకు  కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆహ్వానం పంపించింది. ఈ భేటీ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జులై 16న జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడాలంటే ముఖ్యమంత్రుల భేటీ అనివార్యమని కేంద్రం భావించింది. ఈ మేరకు వారిని భేటీ కావాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భేటీకి ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రం సర్క్యులర్ ఒకటి విడుదల చేసింది. 

భేటీ హాజరవడం వీలవుతుందా లేదా అనేది తెలపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు. 

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని వివరించారు. మరోవైపు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇదే మంచి అవకాశం భావించిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులను భేటీ కావాలని, జల వివాదాలకు ముగింపు పెట్టించాలని భావిస్తోంది.