శంఖుస్థాపనకి నన్ను పిలవద్దు...పిలిచినా నేను రాను: జగన్

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తూ తనకు ఎటువంటి లేఖ పంపవద్దని కోరారు. ఒకవేళ ఆహ్వానించినా తను హాజరుకానని తెలిపారు. ఆహ్వానం పంపించి ఆ తరువాత తను రానందుకు నిందించవద్దని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొని దానిపై రాజధాని నిర్మించడాన్ని తను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నానని కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడే రాజధాని నిర్మిస్తున్నందున నిరసనగా తను ఈ కార్యక్రమానికి హాజరుకాదలచుకోలేదని వ్రాసారు. రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ ఎందుకు విధించారని ముఖ్యమంత్రిని జగన్ తన లేఖలో ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకొని రాజధానిని నిర్మించడాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అందుకే నిరసనగా తను శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాదలచుకాలేదని తెలిపారు.