ఏపీ ప్రభుత్వం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమైన చర్య: ఐవైఆర్ కృష్ణా రావు

జగన్ సర్కార్ పై ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌‌లు, పాస్టర్లకు ఏపీ సర్కారు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి సంగతి తెలిసిందే. 77,290 మందికి రూ.37.71 కోట్ల సాయం అందనుంది. వీరిలో 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్, మౌజమ్‌‌లు ఉన్నారు. అయితే, మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటాన్ని ఐవైఆర్ కృష్ణా రావు తప్పుబట్టారు.

"మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రచారం చేసుకోవడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం విడ్డూరం. లెక్కల్లో ఎక్కడో తేడా ఉంది. 34 వేల అర్చకులకు 30 వేల పాస్టర్లు." అని ట్వీట్ చేశారు.

"దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కావున, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండబట్టి లెక్కలు నిర్ధారించే అవకాశం ఉంది. మిగిలిన రెండు మతపరమైన సంస్థలు ప్రభుత్వ సంబంధం లేకుండా పని చేస్తున్నాయి కావున ఆ లెక్కలు నిర్దిష్టంగా ఉండే అవకాశం తక్కువ." అన్నారు.

"అర్చకులు అందరూ ప్రభుత్వ ఆధీనం లో పని చేస్తున్నారు. వారికి సహాయం పెద్ద దేవాలయాల ఆదాయం నుంచి ఇవ్వచ్చు. టీటీడీ గత ప్రభుత్వ హయాంలో అర్చక సంక్షేమానికి 100 కోట్లు వాగ్దానం చేసి 50 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 50 కోట్లు విడుదల చేసి ఇతర పెద్ద దేవాలయాలు సహాయంతో అర్చకులను ఆదుకోవచ్చు." అని సూచించారు.

"మిగిలిన మతాల వారికి ఆయా మత సంస్థల నుంచి సహాయం వచ్చే విధివిధానాలు ఏర్పాటు చేయవచ్చు. అది సరైన పద్ధతి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య." అని ఐవైఆర్ కృష్ణా రావు వ్యాఖ్యానించారు.