మూడ్ ఆఫ్ ది నేషన్ మారుతోందా?

నిజమే. కాల్పుల విరమణ  విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు, చివరకు బీజేపీ అభిమానులు, సామాన్యులు  కూడా తప్పు పట్టారు. ఒక విధంగా చూస్తే.. అంతవరకు సానుకూలంగా ఉన్న  ‘మూడ్ ఆఫ్ ది నేషన్’, ప్రతికూలంగా  మారిపోయింది. అంతవరకు  ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధించిన రాజకీయ పార్టీలు విమర్శలకు తెర తీశాయి. కాల్పుల విరమణకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన ట్వీట్లకు సంబంధించి విపక్షాలు చేసిన విమర్శలు, విశ్లేషణలi దేశం మూడ్  ను మరింతగా మార్చివేశాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వ్యాపించింది. ప్రభుత్వం ఇరకాటంలో పడింది.  

అయితే అదే సమయంలో ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. గడచిన 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే..  ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ నష్ట నివారణ  చర్యల వేగం పెంచినట్లు స్పష్టంవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి.. బీజేపీ ముందుగానే  మూడ్ అఫ్ ది నేషన్ ను పసిగట్టింది. కాల్పుల విరమణ నిర్ణయం సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరినీ అసంతృప్తికి గురిచేసిందనే సత్యాన్ని కమల దళం ముందుగానే గుర్తించింది. అందుకే..  ఏ మాత్రం జాప్యం చేయకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సొంత పార్టీలో వినిపించిన అపశ్రుతులను సరి చేసేందుకు  చర్యలు తీసుకుంది.  అందులో భాగంగానే  తిరంగ యాత్ర  పేరిట పార్టీ క్యాడర్ ముందు ఒక కార్యక్రమాన్ని ఉంచిందని పార్టీ వర్గాలు  పేర్కొంటున్నాయి. మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే అంటున్నారు.

మోదీ ప్రసంగం పార్టీని మళ్ళీ ఏక తాటిపైకి తీసుకు వచ్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  కాల్పుల విరమణ నిర్ణయం పట్ల మరీ ముఖ్యంగా అమెరికా ఆదేశాలతో మోదీ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని జరిగిన ప్రచార ప్రభావాన్ని మోదీ ప్రసంగం కొంతవరకు తగ్గించగలిగిందని అంటున్నారు. అలాగే..  మోదీ ప్రసంగానికి కొనసాగింపుగా  భారత విదేశాంగ శాఖ  మంగళవారం(మే 13) ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, జమ్మూ కశ్మీర్ వ్యవహారం, అమెరికా జోక్యంకు సంబంధించి మరింత స్పష్టత ఇచ్చిందిని అంటున్నారు.  అందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ శాఖ మరో మారు స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదత పాకిస్థాన్ నుంచే వచ్చిందని దానిపై డీజీఎంవోల సమావేశంలో చర్చించి  నిర్ణయంతీసుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే.. పరోక్షంగానే అయినా  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన చప్పుళ్ళకు జైస్వాల్ సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో భారత్, అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదని చెప్పారు. ఇక సింధూ   జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కాశ్మీర్‌పై తమ విధానం మారలేదని తెలిపారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఎంత మాత్రమూఆమోదించబోమని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి..  నో ..థాంక్స్ అని చెప్పకనే చెప్పారు.

అదలా ఉంటే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మే 13)  ఉదయం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌ బేస్‌ను సందర్శించి, జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్యసాహసాలను అభినందించారు. ఈ సందర్భంగా పాక్ నడ్డివిరిచిన ఎస్-400 (S-400) మిసైల్ బ్రాక్‌ డ్రాప్‌లో వీర జవాన్లకు ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

అదొకటి అయితే ప్రధాని అదంపూర్ విమానాశ్రయం పర్యటించడం ద్వారా, అదంపూర్ ఎయిర్‌బేస్‌ను తుత్తినియలు చేసినట్టు పాక్ చేస్తున్న అసత్య ప్రచానికి మోదీ ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చారు. అదంపూర్ ఎయిర్ బేస్‌లోని రన్‌వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని పాక్  సాగించిన అసత్య ప్రచారాన్ని మోదీ పర్యటన తుత్తునియలు చేసింది.  

ఈ పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆపరేషన్ సిందూర్ ఫలాలు చేజారకుండా   కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని  అంటున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఎలా స్పందించాలనే విషయంలో స్పష్టత లోపించడం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా శశి థరూర్, చిదంబరం, మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులు  పార్టీ లైన్ కు విభిన్నంగా స్పందించిన తీరు హస్తం పార్టీని ఇరకాటంలో పడేస్తే, కమల దళానికి కలిసొచ్చిందని అంటున్నారు.