ఐర్లాండ్ వ్యక్తికి పాజిటివ్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం!
posted on Dec 7, 2021 10:39AM
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఐర్లాండ్ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయన శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చాకే ఒమిక్రావ్ వచ్చింది లేనిది నిర్దారణ కానుంది. ఐర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో శృంగవరపు కోటలో ఆందోళన నెలకొంది.
విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్ నుంచి ముంబై ఎయిర్పోర్టులో దిగాడు. అక్కడ కొవిడ్ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఎస్.కోట మండలంలోని అత్తవారింటికి వచ్చాడు. ముంబై ఎయిర్పోర్టు అధికారులు విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వడంతో మూడు రోజుల కిందట వైద్య సిబ్బంది వచ్చి ఆ వ్యక్తితోపాటు, ఆయన భార్య, అత్త నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షించగా ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు రిపోర్టు వచ్చింది. ఒమైక్రాన్ అనుమానంతో శాంపిల్స్ను హైదరాబాద్ పంపించారు.
కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన గ్రామంలో తిరిగారని, చాలా మందిని కలిశారాని చెబుతున్నారు. మరోవైపు హోం క్వారెంటైన్లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. ఆయన పట్టించుకోకుండా వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం మధురువాడ వెళినట్లు సమాచారం. దీంతో ఆయన తిరిగిన ప్రాంత ప్రజలంతా ఇప్పుడు కలవరపడుతున్నారు.