ఐపీఎల్ పునఃప్రారంభం.. కోల్కతాతో ఆర్సీబీకి కీలక మ్యాచ్
posted on May 17, 2025 4:46PM

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్ కోట్, జమ్ములో పాకిస్థాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ , కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి.
అయితే ఈ మ్యాచ్కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది.
ఈ లీగ్ దశ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్లో దాని స్థానం పదిలం అవుతుంది. కానీ, ఈ సీజన్లో సొంత మైదానంలో అత్యధిక మ్యాచ్ల్లో ఓడిపోయిన ఆర్సీబీకి, అదే మైదానంలో కేకేఆర్తో జరిగిన పేలవమైన రికార్డు మరో తలనొప్పిగా మారింది. నిజానికి, 2015 నుంచి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. అంటే, శనివారం ప్లేఆఫ్కు చేరుకోవాలంటే ఆర్సీబీ 10 సంవత్సరాల చరిత్రను మార్చాల్సి ఉంటుంది.
చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన బాగాలేదు. ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్ల్లో కోల్కతా ఆర్సీ బీపై విజయం సాధిం చింది. 2015 తర్వాత ఆర్సీబీ వారి సొంత గడ్డపై ఒక్కసారి కూడా కేకేఆర్ను ఓడించలేకపోయింది. అదే సమయంలో, ఈ మైదానంలో రెండు జట్ల మొత్తం రికార్డులు చూస్తే ఆర్సీబీ వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరగగా, బెంగ ళూరు కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. కోల్కతా 8 మ్యాచ్ల్లో గెలిచింది. ఐపీఎల్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఆర్సీబీ 15 గెలిచి, 20 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే, ఈ సీజన్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ అనేక పాత రికార్డులను బద్దలు కొట్టింది. అది 17 సంవత్సరాల తర్వాత చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగలిగింది. ఆర్సీబీ ఇప్పుడు కోల్కతాపై కూడా అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.