ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు..సారెను సమర్పించిన ఈవో
posted on Jun 26, 2025 10:59AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అమ్మవారికి ఆలయ అలయ ఈవో శీనాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజులు పాటు జరగనున్నాయి. జూన్ 26 నుంచి జులై 4 వరకు వారహి నవరాత్రులు, జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు అమ్మవారి ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.జూన్ 26 నుండి జూలై 24 వరకు వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల నుంచి భక్త సమాజముల అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించడం జరుగుతుంది. మహా మండపంలోని 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి.. ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహిస్తారు. జూన్ 29న కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.
జూలై 4న పూర్ణహుతి కార్యక్రమంతో వారాహి నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి. మేలతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు.ఈ సందర్బంగా ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడారు.. తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసం నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈనెల 29వ తేదీన బంగారు బొనాం సమర్పిస్తారని ఆయన తెలిపారు.