కామ‌న్‌వెల్త్ ఫైన‌ల్లోకి  హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ప‌త‌కం ఖాయం చేసుకున్నారు. శ‌నివారం జ‌రిగిన సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టును నాలుగు ప‌రుగుల తేడాతో ఓడించి హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌ ఫైన‌ల్ చేరుకుంది. బ్యాటింగ్‌లోనూ త‌ర్వాత బౌలింగ్ లోనూ అమ్మా యిలు అద‌ర‌గొట్టారు. కెప్టెన్ మంధాన ఎంతో వేగంగా ఆడటంతో భార‌త్  త‌న ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ చివ‌రి ఓవ‌ర్లో కేవ‌లం 4 ప‌రుగుల దూరంలో ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం పలుమార్లు చేతులు మారినప్పటికీ చివరికి టీమిండియాదే పై చేయి అయింది. వరుస రనౌట్లు ఇంగ్లండ్  కొంపముంచాయి.

ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో ఆరంభంలో 28 ప‌రుగుల‌కే ఓప‌న‌ర్ సోఫియా వికెట్ కోల్పోయింది. త‌ర్వాత వ‌చ్చిన అలీస్ కేవ‌లం 13 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. కెప్టెన్ న‌టాఅఇయా కాస్తంత నిల‌క‌డ‌గా ఆడ‌టంతో ఇంగ్లండ్‌కు క‌ష్టాలు త‌ప్పాయి అనుకున్నారు. కానీ డేనియ‌ల్ వైట్ త‌న వ్య‌క్తిగ‌త స్కోర్ 35 వ‌ద్ద స్నేహ్‌రాణా కి దొరికింది. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 81 ప‌రుగులే అయింది. ఆ త‌ర్వాత న‌టాలీ, అమీజోన్స్‌లు కొంత‌సేపు నిల‌క‌డ‌గా ఆడారు కానీ ఇద్ద‌రూ వరుస‌గా ర‌న్ అవుట్ కావ‌డంతో ఇంగ్లండ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. చివరి ఓవర్‌కు ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి బ్రంట్‌ అవుట్ కావడంతో మ్యాచ్ భారత చేతుల్లోకి వచ్చినట్టే కనిపించింది. నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఇక చివరి రెండు బంతులకు 12 పరుగులు అవసరం కాగా, ఒక్క పరుగు మాత్రమే లభించింది. దీంతో భారత్ విజయం ఖాయమైపోయింది. అయితే, చివరి బంతిని ఎక్లెస్టోన్ సిక్సర్‌గా మలచడంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది.  

అంత‌కు ముందు భార‌త్ బ్యాటింగ్‌లో  మంధాన 32 బంతులు ఎదుర్కొన్న  8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ జెమీమా రోడ్రిగ్స్ కాపాడింది. 31 బంతులు ఆడిన జెమీమా 7 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.