నక్కజిత్తుల పాక్ నడ్డి విరిచిన భారత్
posted on May 15, 2025 9:45AM

భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్ దాడి చేసింది. నాలుగురోజుల ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది. 2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్ ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది. ఆపద సమయంలో ఆదుకున్న భారత్ పట్ల టర్కీ మిత్రద్రోహం చేసింది. భారత్ మంచితనానికి డ్రోన్లతో రుణం తీర్చుకున్న ద్రోహబుద్ది టర్కీది అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాన్ టర్కీ ట్యాగ్ లైన్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. భారత పర్యాటకులు తమ పర్యాటక ప్రదేశాల నుంచి టర్కీని తుడిచేశారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు భారత్ పట్ల నిలువెల్లా ద్వేషం. దాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడిని మాట మాత్రంగా కూడా ఖండించలేదు ఎర్డోగాన్.
ఇక ఇస్లామిక్ దేశాలకు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. అయితే ఇస్లామిక్ దేశాలకు నేతృత్వం వహించాలన్నది టర్కీ కల. దీనికి సౌదీ అరేబియా అడ్డు రావడం, ఆ దేశంతో భారత్ కు మంచి సంబంధాలు ఉండడమే ఆ దేశం భారత్ పట్ల విషం కక్కడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. భారత్ పై పాకిస్థాన్ దాడులు చేయడానికి టర్కీ ఐదు విమానాల్లో ఆయుధాలను కూడా ఆదేశానికి పంపించింది. పాక్ కు ఆయుధాలతో విమానం పంపి ఇంధనం కోసం దిగిందని సమర్ధించుకుంది టర్కీ. అలాగే కరాచీ ఓడరేవుకు యుద్ధనౌక ను పంపింది. ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ లు మాత్రమే మద్దతు పలికాయి. టర్కీ చేసిన ద్రోహాన్ని భారత్ ప్రజలు మర్చిపోరు.
ఇదిలా ఉండగా గత నాలుగు రోజులుగా జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నా భారత్ కు భారీగా నష్టం కలిగించామని పాకిస్థాన్ అవాస్తవాలను ప్రచారం చేసుకుంటోంది. సుదర్శన చక్ర-400 ను నిర్వీర్యం చేశామనీ, ఏయిర్ పోర్టులను నాశనం చేశానని, పౌర ప్రాంతాల్లో దాడి చేయలేదని, సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామనీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరపడిపోతోంది. కాని వాస్తవంగా పాకిస్థాన్ భారత్ కు ఏలాంటి నష్టం కలిగించలేకపోయింది. డ్రోన్స్, క్షిపణిలను భారత్ విజయవంతంగా తిప్పికొట్పింది. ఎల్వోసీ సరిహద్దు వెంబడి ప్రాంతాలపై కాల్పులు జరిపి 16 మంది అమాయక పౌరుల ఉసురు తీసింది. జనావాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడి.. కనీస నీతి నియమాలకు తిలోదకాలొదిలేసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆ తరువాత పాక్ దాడులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టడంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆ దేశం.. భారత్ తో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఉనికి మాత్రంగా కూడా మిగలమన్న భయంతో కాల్పుల విరమణ అంటూ శరణు జొచ్చింది. శరణనన్నవారిపై ఆయుధ ప్రయోగం సరికాదన్న యుద్ధ నీతిని అనుసరించి భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. నక్క జిత్తుల పాక్ ను నమ్మడం కష్టమన్న భావనతోనే.. ఇకపై ఎలాంటి ఉగ్ర దాడి జరిగినా యుద్ధం కిందే పరిగణిస్తామన్న గట్టి హెచ్చరిక చేసిన భారత్.. పాక్ ఇప్పటిలో తేరుకోలేనంత గట్టి గుణపాఠమే చెప్పిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.