24న షిండే నివేదిక, 27న ప్రకటన?
posted on Jan 22, 2013 8:52PM
తాజా సమాచారం ప్రకారం 25వ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనున్న హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే,24వ తేదీనే తెలంగాణా అంశంపై తన మంత్రిత్వ శాఖా సూచనలు పొందుపరచిన తుది నివేదికను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలోపెట్టి బయలుదేరుతున్నారు. హోం మంత్రిగా తన అభిప్రాయాలు తెలియజేసినా, తుది నిర్ణయం మాత్రం సోనియా గాంధీయే తీసుకొంటారు. మరో రెండు రోజుల తరువాత అనగా 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోటనుండి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసే ప్రసంగంలో రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడవచ్చును. ఏ కారణం చేతనయినా ఆ రోజు ప్రకటించకపోయినట్లయితే ఆ మరునాడు అంటే 27వ తేదీన ఖచ్చితంగా ప్రకటన వెలువడవచ్చును. అంతకు రెండు రోజుల ముందే పారా మిలటరీ బలాలు రాష్ట్రం చేరుకొంటాయి. వాటిని మోహరించిన ప్రాంతంబట్టి కేంద్రం ఏమి నిర్ణయం తీసుకోబోతుందో స్పష్టమయిన సంకేతం గ్రహించవచ్చును. ఒకవేళ తెలంగాణాలో మొహరిస్తే, కేంద్రం తెలంగాణాకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు భావించవచ్చును. ఆంధ్రా ప్రాంతాలలో మొహరించినట్లయితే తెలంగణా రాష్ట్రం ప్రకటించబోతున్నట్లు భావించవచ్చును. ఈ నూతన సంవత్సరంలో విడుదల కానున్నఅతి గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఇదేనని చెప్పక తప్పదు.