సినిమా ప్రమోషన్ కు అధికార యంత్రాంగం దుర్వినియోగం.. పవన్ పై మాజీ ఐఏఎస్ పిటిషన్ పై విచారణ 8న
posted on Sep 8, 2025 10:54AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై 8న విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. తన సినిమా ప్రమోషన్ కు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనీ, మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారనీ పేర్కొంటూ, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19న పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం, రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ గత నెలలో హైకోర్టు ముందు విచారణకు వచ్చింది.
విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి , ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారన్నారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్లిస్ట్) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ పిటిషన్ పై మరోసారి హైకోర్టులో వాదనలు జరుగగా..ఈ కేసును సోమవారం (సెప్టెంబర్ 8) విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. దీంతో ఈ కేసు విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.