ఆ పిల్లాడి చివరి క్షణాలు అతి భయానకం

గుర్గావ్ లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చనిపోయిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ చివరి క్షణాలు ఎంత భయానకంగా ఉన్నాయో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్ధం అవుతుంది. రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలు విడిచిన ఆ బాలుడి చివరి దృశ్యాలు.... ఎంతో కర్కశంగా ఉండే పోలీసులని సైతం కదిలించాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, మొదట ప్రద్యుమన్ టాయిలెట్ లోకి వెళ్ళాడు. ఆ మరుక్షణమే బస్సు కండక్టర్ అశోక్ కుమార్ కూడా టాయిలెట్ లోకి ప్రవేశించాడు. అశోక్ కుమార్ బయటకి వెళ్లిపోయిన కాసేపటికి గొంతుపైనా, మెడపైనా భారీగా కోసిన గాయాలతో... ఒంటి నిండా రక్తంతో... ప్రద్యుమన్‌ మెల్లగా గోడపట్టుకొని పాకుతూ టాయిలెట్‌ నుంచి పాకుతూ బయటకు వచ్చి డోర్‌ దగ్గర అలాగే నిస్సత్తువగా పడిపోయాడు. కొన్ని క్షణాల్లోనే రక్తపు మడుగులో పడి ప్రద్యుమన్‌ అక్కడే నిర్జీవిగా మారాడు. ఆ కుర్రాడిని పరీక్షించిన వైద్యులు సైతం అధిక రక్త శ్రావం అవ్వడం వల్లే చనిపోయాడని ధ్రువీకరించారు. పోస్ట్ మార్టం నివేదికలో, ప్రద్యుమన్‌ మెడపై రెండు బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది. గొంతు వద్ద నరాలు తెగిపోవడంతో చిన్నారి గొంతుక ఆగిపోయింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు అశోక్‌కుమార్‌ విచారణ సమయంలో తానే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడని సమాచారం