టీడీపీ, వైసీపీ కార్యకర్తల దాడి.. పోలీసుకు గాయాలు

 

ఎన్నికల రోజు ఏపీలో పలు చోట్ల టీడీపీ,వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకున్నారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని హుస్సేన్‌పురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు. మొదట చిన్నగా మొదలైన గొడవ పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. కర్రలతో ఇరువర్గాలు తలపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వినోద్‌కు కర్ర తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.