దొంగ ఓట్లు, రిగ్గింగ్ కలకలం.. తిరుపతి ఉపఎన్నిక రద్దు? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ దౌర్జన్యాలకు దిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని  ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి వచ్చినట్లు గుర్తించారు. బయటి నుంచి వచ్చిన ఓటర్లకు స్లిప్‎లను వాలంటీర్లు పంపిణీ చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా ఆమె పట్టుకున్నారు.

వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చారని  విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా యథేచ్చగా వైసీపీ నేతలు తిరుగుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.   తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఉన్న ఆధారాలను పరిశీలించి మిగతా చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు  తిరుపతి ఉపఎన్నికకు  వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సిందని.. ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారన్నారు.  దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి? అని  ప్రశ్నించారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే.. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. 

వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు నిలదీశారు.  ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌  పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారు? అని  చంద్రబాబు ప్రశ్నించారు.  ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.