ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ దర్యాప్తు.. ఇట్స్ కన్ ఫర్మ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇక ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాంచి దూకుడుమీద ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. వాస్తవానికి గతంలోనే ఈడీ ఈ కేసును టేకప్ చేయడానికి కోర్టును అభ్యర్థించినా ఇంత వరకూ అనుమతి రాలేదు.

ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్నఆరోపణలు ఉండటంతో ఈ కేసు ఈడీ టేకప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతించాల్సిందిగా ఈడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను గతంలోనే విచారించిన కోర్టు అప్పట్లో తీర్పు వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా ఈడీకి రాజ్ కేశిరెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతి ఇస్తూ మంగళవారం (మే 20) తీర్పు వెలువరించింది.  

దీంతో రాజ్  కేసిరెడ్డిని ఈడీ విచారించేందుకు సన్నద్ధమౌతున్నది. ఏసీబీ, సీఐడీడ కేసులు, దర్యాప్తులతో పోలిస్తే ఈడీ తీరు భిన్నంగా ఉంటుంది. ఈడీ కేసు నమోదు చేసిందంటే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిందితులే నిరూపించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి బ్రేక్ డౌన్ అయిపోయారనీ, అప్రూవర్ గా మారేందుకు రెడీ అయిపోయారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడమంటే.. ఈ కేసులో నిందితులందరికీ ఉచ్చు గట్టిగానే బిగిసిందని పరిశీలకులు అంటున్నారు.