డీకే శివకుమార్ సోదరుడుకి ఈడీ నోటీసులు
posted on Jun 17, 2025 5:15PM

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా జూన్ 19వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నాది. పీఎంఎల్ఏ కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం.ఏప్రిల్ నెలలో, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని ఐశ్వర్య గౌడ చెప్పుకుందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె పలువురిని చీటింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య గౌడ దుర్వినియోగం చేసిందని, తాను ఆయన సోదరినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డీకే సురేశ్ గతంలోనే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కులకర్ణి అనే వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.