వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేసుకుంటూ తమ పార్టీ పేరును దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ వైఎస్సార్సీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది.

ఏపీలో అధికార పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, వైఎస్సార్ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందని మహబూబ్ బాషా అన్నారు. వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు. తమదే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన  కోర్టుకు తెలిపారు. జగన్ పార్టీ పేరును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మహబూబ్ బాషా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.