అయితే అటు లేకపోతే ఇటు.. దానం డ్యుయల్ పాలిటిక్స్

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున  పెట్టేలా  తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీఆర్ఎస్ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 27) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందనీ,  కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఇక  కీలక పోస్టులో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైనా దానం పాజిటివ్‌గా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్‌ హైదరాబాద్‌’ అనే ఎక్స్‌ హ్యాండిల్‌ పోస్ట్‌ చేసిన ఫొటోను స్మితా సబర్వాల్‌ రీపోస్ట్‌ చేశారు. సేవ్‌ హైదరాబాద్‌, సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్‌ రాక్‌ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వినిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్‌ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. 

ఆ మేరకు బీఎన్‌ఎస్‌ 179 సెక్షన్‌ కింద స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్  ద్వారా స్మిత వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్‌ చేశారని, స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత స్మిత ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. చట్టపరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2వేల మంది రీషేర్‌ చేశారని .. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా.? అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు . విచారణ తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. 

దాంతో పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.  కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. 10 ఏళ్లలో 13లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడుతున్నారు. స్మితా సబర్వాల్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చెట్లను నరికేస్తే ఎందుకు నోరు  విప్పలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి, ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు.
అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారి అనీ, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని  దానం కితాబు ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ  నడుస్తంది.  కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్‌ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తుంటే,  దానం నాగేందర్ మాత్రం  ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ ‌టాపిక్‌గా మారింది.

మళ్లీ బీఆర్ఎస్‌ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితాకు కితాబు ఇవ్వడం వెనుక అంతర్యం ఏంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలూ చర్చించుకుంటున్నాయి. దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్‌ను పరోక్షంగా సమర్థించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చమొదలైంది. కాంగ్రెస్‌లో దానం నాగేందర్‌కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో, బీఆర్ఎస్‌ ప్రస్తావన తీసుకొస్తూ,  ఎమోషనల్ బ్లాక్‌మెయి లింగుకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా-ఈ కార్ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌  పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అలాగే హైడ్రా కూల్చివేతలపైనా విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారి తీసింది. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ తరుపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దానం తీరులో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారంట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో  ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. 

ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్‌కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఓ వైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరగుతుండడం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.