కాంగ్రెస్‌ పార్టీవి చెత్త రాజకీయాలు : మోదీ

 

పలు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలవడంతో.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీవి చెత్త రాజకీయాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని, సర్జికల్ స్ట్రైక్స్ పై కూడా వారు రాజకీయాలు చేసి సైనికులను అవమానించారని ధ్వజమెత్తారు. అనవసర భయాలు, అనుమానాలు సృష్టించే వారిని దూరంగా ఉంచాలని అన్నారు. అలాంటి వాళ్లు హాయిగా ఉండి మీ భయాలు, సందేహాలతో ఆడుకుంటారని.. అలాంటి మనుషులు, పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్తూ.. భయాలు సృష్టిస్తోందని అన్నారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి, మా హయాంలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ చర్చ జరుపుదాం రమ్మని ఆహ్వానిస్తే.. అలాంటి చర్చకు దూరంగా పారిపోతున్నారని అన్నారు. తాము ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ కోసం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ సమాజాన్ని విడదీస్తోందని మోదీ ఆరోపించారు.