సారీ, అధిష్టానాన్ని ఇక ఆపలేను: లగడపాటి
posted on Aug 8, 2013 4:51PM
రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణమే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తన పోరాటమంతా తెదేపా వల్ల వృదా అయిపోయిందని, చంద్రబాబు ఇకనయినా నోరు విప్పి రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టం చేయాలని, లేకుంటే తెలుగు జాతి ఆయనను ఎన్నటికీ క్షమించదని అన్నారు. తను రాష్ట్రం విడిపోకుండా ఉండాలని విశ్వప్రయత్నాలు చేసానని, కానీ ఆపలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా చేయగల శక్తి తనకు లేదని ఆయన తెలిపారు. తెదేపా, వైకాపాలు తమ ద్వంద వైఖరి కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకోసం కృషిచేయాలని ఆయన హితవు పలికారు.
ఇక మొన్నటి వరకు రాష్ట్ర విభజన చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేస్తానని ప్రగల్బాలు పలికిన కావూరి సాంభ శివరావు, తన చిరకాలవాంచ అయిన కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన కారణంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పోయారు. ఇప్పుడు నేనేమి చేయలేని నిస్సాహయుడనని ఆయన అన్నారు. మరి కొద్ది రోజులలో మరి కొంత మంది మంత్రులు యంపీలు కూడా ఇదే పాట పాడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంటోనీ కమిటీ కూడా ఏర్పాటయిపోయింది కనుక ఇక కాంగ్రెస్ వ్యూహం ప్రకారం మెల్లగా కమిటీతో సమావేశాలు మొదలుపెట్టి, కొన్ని వరాలు ప్రకటింప జేసుకొని అంతిమంగా రాష్ట్ర విభజనకు అయిష్టంగానే ఒప్పుకొంటున్నట్లు నటిస్తూ ఎన్నికలకి సిద్దం అయిపోతారు. వారితో బాటే మిగిలిన పార్టీ నేతలు కూడా సమైక్య విరమణ చేసేయడం మనం చూడవచ్చును.